అనకాపల్లి,డిసెంబర్25(అక్షర ప్రళయం)
మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి శతజయంతి వేడుకలను అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీ.ఎం రమేష్ ఆదేశాల మేరకు అనకాపల్లి పట్టణం లో ఉన్న ఎం.పీ క్యాంపు కార్యాలయంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి కేతినేని సురేంద్రమోహన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.అనకాపల్లి జిల్లా కార్యవర్గం మరియు ప్రధాన నాయకులుతో కలసి ముందుగా వాజపేయి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కేతినేని సురేంద్రమోహన్ మాట్లాడుతూ వాజపేయి గారు విలక్షణమైన రాజకీయాలకు గుర్తుగా దేశవ్యాప్తంగా సుపరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నామన్నారు.వాజ్పేయి భారతదేశ వైభవాన్ని, నైతిక విలువలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారని, దేశ ప్రజలకు స్పూర్తి ప్రదాతగా నిలిచారని, ప్రోక్రాన్ అణుపరీక్షలు, స్వర్ణ చతుర్భుజీ, గ్రామీణ సడక్ యోజన ఆయన చలువేనని ప్రత్యేకంగా కొనియాడారు.అంతేగాక పార్లమెంట్లో బలనిరూపణ విషయంలో అనేక మంది ఇతర పార్టీలో ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, నీతి, నిజాయితీగా వ్యవహరించి పదవిని కోల్పోయిన మహనీయుడు వాజ్ పేయి అని కీర్తించారు.అదేవిధంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్పూర్తితో వాజ్ పేయి నడిచారు అని ఈ సందర్భంగా గుర్తుచేశారు.వాజ్ పేయి అడుగుజాడల్లో ఆయన ఆశయాలను తూచ తప్పకుండా అమలు చేస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీ అని తెలియజేశారు. కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి కొండబాబు,పట్టాభి ప్రసాద్, జిల్లా యువమోర్చ అధ్యక్షులు గేదల స్వరూప్,అసెంబ్లీ కన్వినర్ బొడ్డేడ నాగేశ్వరావు, ఊడా రమేష్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.