జనవరి 29 నుంచే పూర్తిగా అమల్లోకి ఎన్నికల ప్రవర్తనా నియమావళి
ఫిబ్రవరి 03 నుంచి 10వ తేదీ సాయంత్రం 03.00 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ
డీసీపీతో కలిసి వివరాలు వెల్లడించిన విశాఖ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
విశాఖపట్టణం, జనవరి:30(అక్షర ప్రళయం)
ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 4.గంటల వరకు జరగనుందని, దీనికి సంబంధించిన అన్ని రకాల ప్రక్రియలను అధికార యంత్రాంగం మొదలు పెట్టిందని విశాఖపట్టణం జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం వెలువరించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 29వ తేదీ నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని తెలిపారు. 24 గంటల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, పబ్లిక్ ప్రాంతాల్లో రాజకీయపరమైన పోస్టర్లు, ఫోటోలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియలో భాగంగా గురువారం ఉదయం డీసీపీ అజిత, జిల్లా రెవెన్యూ అధికారి, సహాయక రిటర్నింగ్ అధికారి బీహెచ్ భవానీ శంకర్ లతో కలిసి కలెక్టరేట్ మీటింగు హాలులో జిల్లా కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, నామినేషన్ల ప్రక్రియ, నోడల్ అధికారుల నియామకం, పోలింగ్ స్టేషన్లు తదితర అంశాలను సూక్ష్మంగా వివరించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఉత్తరాంధ్ర పరిధిలోని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆర్వోలుగా, డీఆర్వోలు ఏఆర్వోలుగా వ్యవహరిస్తారని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం వెలువరించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుందని, ఆ రోజు నుంచి అన్ని ప్రభుత్వ పని దినాల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు కలెక్టర్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తారని కలెక్టర్, ఆర్వో హరేంధిర ప్రసాద్ తెలిపారు. 10వ తేదీ సాయంత్రం 3.గంటలతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుందని, 11న పరిశీలన, 13న ఉపసంహరణ ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. 27వ తేదీ ఉయం 08. నుంచి సాయంత్రం 4.గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. మార్చి 3వ తేదీన కౌంటింగ్ ప్రారంభమవుతుందని, 08వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని కలెక్టర్ వివరించారు. జనరల్ అభ్యర్థులు రూ.10,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5,000 ధరావతు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫారం-26 ద్వారా అఫడవిట్ సమర్పించాలన్నారు. అనుమతుల జారీకి సంబంధించి కలెక్టరేట్లో సింగిల్ విండో డెస్కు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. సాధారణ ఎన్నికల మాదిరిగానే ఇప్పుడు కూడా అన్ని రకాల నిబంధనలు అభ్యర్థులకు వర్తిస్తాయని స్పష్టం చేశారు.
ఓటర్లు 21,555 పోలింగ్ కేంద్రాలు 123
డిసెంబర్ 30, 2024న వెలువరించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తుది ఓటర్ల జాబితా ప్రకారం ఆరు జిల్లాల పరిధిలో 21,555 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ తెలిపారు. వారిలో పురుష ఓటర్లు 12,948, మహిళా ఓటర్లు 8,607 మంది ఉన్నారని పేర్కొన్నారు. అర్హత కలిగిన వారు నామినేషన్ ప్రక్రియ ముగియడానికి పది రోజుల ముందు వరకు అనగా జనవరి 31వ తేదీ సాయంత్రం 03.00 గంటల వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర పరిధిలో 123 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. విశాఖపట్టణంలో 13, అనకాపల్లిలో 24, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11, విజయనగరంలో 29, పార్వతీపురం మన్యంలో 15, శ్రీకాకుళంలో 31 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వివరించారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు సమకూరుస్తున్నామని కలెక్టర్ చెప్పారు. డీసీపీ అజిత మాట్లాడుతూ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ప్రవర్తనా నియమావళి అమలు పర్యవేక్షణకు 23 బృందాలు
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్ట అమలుకు చర్యలు తీసుకున్నామని, దానిలో భాగంగా వివిధ స్థాయి అధికారులతో కూడిన 12 ఎంసీసీ బృందాలను నియమించామని కలెక్టర్ చెప్పారు. అలాగే మండలానికి ఒకటి చొప్పున 11 ఫ్లైయింగ్ స్వ్కాడ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. జీవీఎంసీ అదనపు కమిషనర్, జడ్పీ సీఈవో, భీమిలి, విశాఖపట్టణం ఆర్డీవోలను నోడల్ అధికారులుగా నియమించినట్లు వెల్లడించారు.