ప్రభుత్వ కార్యక్రమంగా ప్రకటించిన ఏపీ సర్కార్కు కృతజ్ఞతలు
విశాఖలో పలు కార్యక్రమాలు
ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లూరు రూప
విశాఖపట్నం,( అక్షర ప్రళయం)
ఏటా మాఘ శుద్ధ విధియ రోజున వాసవీమాత ఆత్మార్పణ దినంగా పాటించి, పెనుగొండలోని అమ్మవారికి ప్రభుత్వమే పట్టు వస్త్రాలు సమర్పించేలా జీవో విడుదల చేసిన ఏపీ సర్కార్కు ఏపీ ఆర్యవైశ్య వెల్ఫేర్, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్, విశాఖ 31వ వార్డు జనసేన ప్రెసిడెంట్ కొల్లూరు రూప కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్యవైశ్యులంతా ఏళ్లగా ఎదురు చూస్తున్న కళను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 31న శుక్రవారం ఈ సందర్భంగా విశాఖ పరిధిలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారన్నారు. వన్టౌన్లోని కన్యకా ఆలయంలో ఉదయం 7.30గంటల నుంచి వాసవీ ట్రస్టు ప్రతినిధి విన్నకోట రామమూర్తి ఆధ్వర్యంలో పూజలు చేయనున్నారన్నారు. అదే విధంగా తమ్మన అమర్నాథ్ ఆధ్వర్యంలో పాండురంగపురంలోని హోమం నిర్వహించనున్నారని, గోపాలపట్నంలో కొల్లూరు సత్యనారాయణ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారన్నారు. ఆర్యవైశ్యులంతా ఐక్యంగా అమ్మవారికి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందాలని రూప ఆ ప్రకటనలో కోరారు.