విశాఖ తూర్పు,(అక్షర ప్రళయం)
ఇటీవల ఎంవిపి కాలని సెక్టర్ 3లో జరిగిన చోరీ సంఘటనను తాము ఛేదించి చోరీసొత్తును స్వాధీనం చేసుకున్నామని ద్వారక క్రైమ్ ఏసిపి ఎ.వెంకటరావు తెలిపారు. సోమవారం ఎంవిపి క్రైమ్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన ఎంవిపి కాలని సెక్టార్ 3లో నివాసం ఉంటున్న కె.శామ్యూల్ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఇంటిలో జరిగిన దొంగతనం కేసులో జోడుగుళ్ళ పాలెంకు చెందిన వాసుపల్లి నరసింగరావు అనే పాత నేరస్తున్ని అదుపులోకి తీసుకుని విచారించా మన్నారు. ఆ రోజు నిందితుడు అపహరించిన 61,700 రూపాయలు విలువ చేసే సొత్తు 55 ఇంచుల సోనీ బ్రేవియ టివి, ఫేబర్ నాలుగు బర్నర్ల గ్యాస్ స్టవ్ ను అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టు చేశామన్నారు. ఈ కేసును ఛేదించి నేరస్తుని అరెస్టు చేయడంలో తమ క్రైమ్ సిఐ వి.చక్రధర రావు, ఎస్ఐ ఎం.అప్పలరాజు, ఎఎస్ఐ డి.కిషోర్ బాబు, కానిస్టేబుల్లు పి.అప్పలరాజు, అగస్టీన్స్ తదితరులు గట్టిగా కృషి చేశారన్నారు.