ఏ.యు క్యాంపస్,(అక్షర ప్రళయం)
గత నెల రోజులుగా స్టైపెండ్ పెంపు కోసం గత నెల రోజులుగా పోరాడుతున్న వెటర్నరీ జూనియర్ డాక్టర్లకు బుధవారం మార్చి 5న దిశ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రా యూనిర్సిటీ విద్యార్థులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా దిశ సభ్యులు మాట్లాడుతూ వెటర్నరీ జూనియర్ డాక్టర్లకు నెలకి కేవలం రూ. 7000లు మాత్రమే స్టైపెండ్ వస్తుంది. పెరుగుతున్న అద్దెలు, సరుకుల ధరలను బట్టి ఈ స్టైపెండ్ కనీస అవసరాలకు కూడా సరిపోదన్నారు. ఎంబీబీఎస్, హోమియోపతి వంటి ఇతర వైద్య విద్యా కోర్సుల్లో ఉన్న జూనియర్ డాక్టర్లకు నెలకు రూ. 25000 వరకు స్టైపెండ్ వస్తుండగా వెటర్నరీ జూనియర్ డాక్టర్లకు ఇంత తక్కువ వస్తుంది. ఇతర రాష్ట్రాల్లో 14వేల వరకు స్టైపెండ్ ఇస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. విద్యార్థులందరి సమస్యలతో పాటు సమాజంలోని సమస్యలన్నింటినీ లింక్ చేసినప్పుడే ఈ సమస్యలకు మూల కారణాలు కనుక్కోగలమని, దానికి వ్యతిరేకంగా పోరాడగలమని, శాశ్వత పరిష్కారాలు సాధించగలమని దిశ సభ్యులు అన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రా యూనివర్సిటీ దిశ విద్యార్థి సంఘం యూనిట్ తరపున వెటర్నరీ జూనియర్ డాక్టర్ల న్యాయమైన పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని అన్నారు.